ఇజ్రాయెల్ దాడిపై భగ్గుమంటున్న పశ్చిమాసియా..
ఓవైపు అమెరికా వద్దంది..బ్రిటన్ సంయమనం పాటించమంది. అయినా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. తాను అనుకుంది.. అనుకున్నట్లు చేసుకుంటూ ముందుకుసాగుతోంది. మొన్న సిరియాలోని ఇజ్రాయెల్ రాయభారి కార్యాలయంపై దాడి చేసింది. ఆదాడిలో ఏడుగురు ఇరాన్ అధికారులు చనిపోయారు. సాక్షాత్తు తమ రాయభార కార్యాలయంపై దాడి చేయడంతో.. ఇరాన్ రగిలిపోతోంది. దాడి చేస్తామని చెప్పినట్లుగానే.. ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేసింది. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్’ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది.
అయితే అమెరికా, బ్రిటన్ సహకారంతో తన రక్షణ వ్యవస్థలతో వాటిని కూల్చేసింది. అయితే .. తాము ప్రతీకార దాడులు చేస్తామన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అన్నట్లుగానే.. ఇరాన్ పై శుక్రవారం తెల్లవారుజామునపెద్ద ఎత్తున దాడులు చేసినట్లు సమాచారం. తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగినా.. పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని ఇజ్రాయెల్ను ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించిన రోజు వ్యవధిలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాము మరింత భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదని ఆయన తేల్చి చెప్పారు.
ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. కానీ, ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది ఇరాన్. వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉన్నాయి. మరోవైపు తమ గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు అక్కడి అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. అలాగే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైతం సిద్ధం చేసింది. గుర్తు తెలియని మినీ డ్రోన్లను ధ్వంసం చేయడానికి ఈ చర్య తీసుకొన్నట్లు ఇరాన్ మీడియా ఐఆర్ఐబీ వెల్లడించింది.
ఇప్పుడు మళ్లీ ఇరాన్ దాడులకు పదును పెడుతోంది. తమపై దాడులు చేసిన ఇజ్రాయెల్ ను వదలమని స్పష్టంగా చెబుతోంది. దీనికి తోడు పశ్చిమాసియాలోని పలు ఉగ్రగ్రూపులు సైతం.. ఇరాన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో ఈపరిణామాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ ను నిలువరించాల్సిన పాశ్చాత్య ప్రపంచం సైతం మద్దతుగా నిలుస్తుండడంతో.. పరిస్థితి మరింతగా విషమించినట్ల కనిపిస్తోందంటున్నారు రక్షణరంగ నిపుణులు.