మయన్మార్ సరిహద్దుల్లో భారత్ కంచె నిర్మాణం..
పొరుగుదేశం మయన్మార్ లో కల్లోల పరిస్థితులు... భారత్కు ఇబ్బందికరంగా మారాయి. అక్కడ ఆర్మీ, ప్రజాస్వామ్య అనుకూల గ్రూపుల మధ్య పోరాటం కాస్తా ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారింది. దీంతో ఇన్నాళ్లు మయన్మార్ పౌరులు.. భారత్లోకి రావడం పరిపాటిగా మారింది. అయితే.. ఇటీవలే కొందరు సైనికులు సరిహద్దులను దాటి భారత్ లోకి ప్రవేశించడం కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య యథేచ్ఛగా జరుగుతున్న రాకపోకలను నిలిపివేసింది.
ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్ (ట్విటర్) వేదికగా కీలక ప్రకటన చేశారు. సరిహద్దులను మరింత బలోపేతం చేయడంపై మోడీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా అంశం తదితర కారణాల దృష్ట్యా భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని రద్దు చేయాలని హోంశాఖ నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు మొదలుపెట్టాం. అందువల్ల తక్షణమే ఈ ఎఫ్ఎంఆర్ను నిలిపివేస్తున్నామన్నారు అమిత్షా. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లు మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నాయి.
ఇప్పటి వరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే, ఇటీవల ఆ దేశం నుంచి భారత్లోకి అక్రమ చొరబాట్లు పెరిగాయి. దీంతో వీటిని అరికట్టేందుకు సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించనున్నట్లు అమిత్ షా ఇటీవల వెల్లడించారు. ఇప్పటికే మణిపుర్లోని మోరేలో 10 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. హైబ్రిడ్ నిఘా వ్యవస్థద్వారా మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్లలో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.