ఈయూలో రైతు ఆగ్రహజ్వాల..
పెరిగిన సాగు ఖర్చులు, మద్దతు ధర పెంపు సహా పలు డిమాండ్లతో రైతన్నలు బ్రస్సెల్ వీధులను కమ్మేశారు. యూరోపియన్ పార్లమెంటు సమావేశాల సమయంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. తమ సమస్యలను ప్రస్తావిస్తూ.. పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే రైతుల ఆందోళనలను అడ్డుకునేందుకు భద్రతాబలగాలు ప్రయత్నించాయి. వాటర్ కెనాన్స్, స్మోక్ బాంబ్స్ తో వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించాయి. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన రైతులు.. పార్లమెంటు దగ్గర ఆందోళనను ఉధృతం చేశారు. కోడిగుడ్లు విసరడం, బాణసంచా కాలుస్తూ ఆందోళనలు నిర్వహించారు.
పన్నులు, పెరుగుతున్న ఖర్చులు .. దీనికితోడు చవకైన దిగుమతులతో తీవ్రంగా నష్టపోతున్నామని యూరోపియన్ యూనియన్ దేశాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రస్సెల్లో జరుగుతున్న యూరోపియన్ యూనియన్ నాయకుల శిఖరాగ్ర సమావేశాన్ని టార్గెట్ చేశారు రైతులు. తమకు ప్రభుత్వాల నుంచి మరింత సాయం కావాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే.. ఆహారం కొరత ఏర్పడుతుందని హెచ్చరించారు. మీరు భూమిని ప్రేమిస్తే దానిని నిర్వహించే వారికి మద్దతు ఇవ్వండంటూ రైతులు బ్యానర్లను ప్రదర్శించారు, రైతులు లేకుంటే ఆహారం లేదన్న సంగతిని పార్లమెంటు అర్థం చేసుకోవాలని వారు హెచ్చరించారు. ఇప్పటికే ఫ్రాన్స్ సహా పలు యూరోపియన్ దేశాల్లో కొన్ని వారాల నుంచి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
గిట్టుబాటు ధరలతో పాటు విదేశాల నుంచి దిగుమతులను తగ్గించాలంటూ ఫ్రెంచ్ రైతులు ఆందోళన పర్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈపరిణామం.. ఆహార వస్తువులపైనా పడుతోంది. మరోవైపు రైతుల ఆందోళనలు.. రవాణవ్యవస్థకు సమస్యగా మారింది. దీంతో సరుకుల సరఫరా ఆలస్యమవుతోంది. దీనిపై వెంటనే ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది.
మరోవైపు ఈయూలోని పలుదేశాలు.. రైతుల ఆందోళనలపైనా ఫోకస్ పెట్టాయి. ఫ్రాన్స్ సహా పలుదేశాల అధినేతలు..రైతుల సమస్య చాలా తీవ్రమైనదని వ్యాఖ్యానించారు. వీటిని వీలైనంత వేగంగా పరిష్కరించాలన్నారు.మరోవైపు..తమ ఆందోళనలు పరిష్కారం కాకుంటే .. ఆందోళనలు మరింతగా ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. మరోవైపు రైతుల ఆందోళనలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుండడంతో.. ఈయూ దేశాలు కూడా వీటిని నిశితంగా గమనిస్తున్నాయి.