తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల జాబితా లిస్ట్
దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రెండు, తెలంగాణలో నాలుగు పార్టీలకు ఈ గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన వాటిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైసీపీ), తెలుగుదేశం పార్టీలున్నాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్తో పాటు తెలుగుదేశం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీ హోదా పొందినట్లు వెల్లడించింది. వీటికి ప్రస్తుతం కేటాయించిన గుర్తులను ఆ రాష్ట్రాల్లో రిజర్వు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నాలుగు పార్టీల చిరునామాలూ హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. వీటికి అతీతంగా కేంద్ర ఎన్నికల సంఘం 193 ఫ్రీసింబల్స్ను విడుదల చేసింది. అందులో జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ ఉంది. దీన్ని ఇదివరకే జనసేనకు కేటాయించినప్పటికీ తాజా ఉత్వర్వుల్లో మాత్రం దాన్ని ఫ్రీసింబల్గానే ఉంచింది. ఆటోరిక్షా, హ్యాట్, ఇస్ట్రీపెట్టె, ట్రక్కు గుర్తులను మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇవ్వడం లేదని పేర్కొంది. ఇవి కారు గుర్తును పోలి ఉండటంతో వాటిని తెలుగు రాష్ట్రాల జాబితానుంచి మినహాయించింది. జాతీయ పార్టీల జాబితాలో ఆప్, బీఎస్పీ, బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.