ట్విటర్ కు షాక్... ఇదే చివరి అవకాశం
నూతన ఐటీ నిబంధనలు పాటించేందుకు గాను ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్కు కేంద్ర ప్రభుత్వం చివరి అవకాశం కల్పించింది. జులై 4వ తేదీలోగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలన్నింటినీ ట్విటర్ పాటించాలని తెలిపింది. లేదంటే ఆ సంస్థ మధ్యవర్తిత్వ హోదా కోల్పోతుందని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు తాజా నోటీసులు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కంటెట్, ఇతర అంశాల్లో నూతన ఐటీ నిబంధనలను పాటించాలని ఇప్పటికే ట్విటర్కు పలుమార్లు నోటీసులు జారీ అయ్యాయి. కానీ ఆదేశాలను ట్విటర్ అనేకసార్లు ఉల్లంఘిస్తూనే వస్తోంది. జూన్ 27న మరోసారి ట్విటర్ చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్కు మరోసారి నోటీసులు జారీ చేశాం. జులై 4వ తేదీలోగా కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని ఆదేశాలను, నిబంధనలను ట్విటర్ పాటించాలి. ఇదే చివరి నోటీసు. అప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తే మధ్యవర్తిత్వ హోదా కోల్పోతుంది అని ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసుల్లో హెచ్చరించింది.