తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం : అదానీ గ్రూప్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని స్పష్టం చేసింది. ప్రభుత్వం మారినప్పటికీ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో తమ కంపెనీ ముందుంటుందన్నారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అదానీ పోర్ట్స్ అడ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ, అదానీ ఏరోస్పేస్ సీఈవో ఆశీస్ రాజ్వన్షీ చర్చలు జరిపారు. పారిశ్రామికాభివృద్ధికి, ఉపాధి కల్పన కోసం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్ నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఏరోస్పేస్ పార్కు, డేటా సెంటర్ ప్రాజెక్టు స్థాపనపై చర్చించారు.
ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి షానవాజ్ ఖాసిం, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.