మాట నిలుపుకోకపోతే.. మా దారి మేం చూసుకుంటాం
ప్రపంచదేశాల ముందు అమెరికా మాకు ఇచ్చిన మాటను నిలుపుకోపోతే మా దేశ ప్రయోజనాల పరిరక్షణకు మా దారి మేం చూసుకుంటాం అంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్జోంగ్ ఉన్ అమెరికాను హెచ్చరించారు. నూతన సంవత్సర సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశంలో అమెరికా ఇంకా మాపై ఆంక్షలతో ఒత్తిడి పెంచాలని చూస్తే మా దారి మేం చూసుకుంటాం అని సృష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం స్వాగతించే సత్ఫలితాలను రాబట్టటం కోసం తాను ట్రంప్తో ఎక్కడైనా ఎప్పుడైనా భేటీ కావటానికి సిద్ధంగా వున్నానని ఆయన తెలిపారు. తమ దేశంపై అమలు చేస్తున్న ఆంక్షల నుండి సత్వర విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఉత్తర కొరియా, అణు రహిత కొరియా ద్వీపకల్పంపై అమెరికా వైఖరి గ్యాంగ్స్టర్లను తలపిస్తోందని వ్యాఖ్యానించింది. అమెరికా మాత్రం కొరియాలో సృష్టమైన పూర్తి స్థాయి అణు నిరాయుధీకరణ పూర్తయ్యే వరకూ తాము ఆంక్షల ఒత్తిడి కొనసాగిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో గత ఏడాది తన భేటీతో ప్రారంభమైన శాంతి చర్చల ప్రక్రియాలో పురోగతి లేకపోవటం పట్ల కిమ్ తన ప్రసంగంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.