ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రాజంపేటలో 'తానా' కార్యక్రమానికి వస్తున్న ప్రముఖులు

రాజంపేటలో 'తానా' కార్యక్రమానికి వస్తున్న ప్రముఖులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో రాజంపేటలో 5వ తేదీన జరగనున్న తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు చేశామని, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజకీయ నాయకులు, సినీ గాయనీ గాయకులు, టీటీడి అధికారులు, అన్నమాచార్య గాయనీమణులు, కవులు, కళాకారులు వస్తున్నట్లు  సంఘం అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు.

రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు సిఎం రమేష్‌, గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యేలు వయ్యావుల కేశవ్‌, మేడా మల్లికార్జున రెడ్డితోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్‌ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, టీటీడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, టీటీడి జెఇఓ పోలా భాస్కర్‌, అడిషనల్‌ డిజిపి పి.వి. సునీల్‌ కుమార్‌  తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

అన్నమాచార్య కీర్తనలతో విశేష ప్రాచుర్యం పొందిన గాయని శ్రీమతి శోభారాజు, గురు కొండవీటి జ్యోతిర్మయి, కామిశెట్టి శ్రీనివాసులు, భమిడిపాటి విశ్వనాథ్‌, సినీ గాయని ఉష, అన్నపూర్ణ మధులిక, నటులు సునీల్‌, నారా రోహిత్‌ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

5వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పాత బస్టాండ్‌ సర్కిల్‌ నుంచి దాదాపు 500 మంది వివిధ కళా బృందాలతో బోయనపల్లె అన్నమయ్య విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సాయంత్రం?6 గంటలకు రైతులకోసం రక్షణ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు కూడా చెప్పారు. రాత్రి 8 గంటలకు అన్నమయ్య సంగీత కచేరీ ఉంటుందన్నారు. సినిమా గాయనీ గాయకులతో సంగీత విభావరి, మిమిక్రీ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయని సతీష్‌ వేమన చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.

 

Tags :