ధ్యానగురువు దాజీని కలిసిన ఆటా నాయకులు
అట్లాంటాలో జూన్ 7,8,9 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాల్సిందిగా ప్రముఖ ధ్యానగురువు, దాజీగా పిలిచే కమలేశ్ డి. పటేల్ను ఆటా నాయకులు ఆహ్వానించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, డైరెక్టర్ అనీల్ బొద్దిరెడ్డి తదితరులు ఆయనను కలిసి ఆటా మహాసభలకు రావాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయనతో కలిసి డిన్నర్ కూడా చేశారు. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చని చెప్పే దాజీ హైదరాబాద్కు సమీపంలో నందిగామ మండలంలో సుమారు 1,400 ఎకరాల్లో కన్హా శాంతివనం పేరుతో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్గా పేరుపొందిన ఈ ప్రాంతంలో ఒకేసారి లక్ష మంది కూర్చుని ఏకాంతంగా ధ్యానం చేసే అవకాశం ఉంది. ఇక్కడ 160 దేశాలకు చెందిన సుమారు ఐదువేల మంది అభ్యాసికులు ఉన్నారు. ధ్యాన గురువుగా చేస్తున్న సేవలకు ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్న ఆయన్ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. శ్రీరామచంద్రమిషన్, హార్ట్ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్, హార్ట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టులను కూడా ఆయన ఏర్పాటు చేశారు.