నేటి నుంచి వైసీపీ మేమంతా సిద్ధం బస్సుయాత్ర...
ఏపీసీఎం వైఎస్ జగన్ .. వైనాట్ 175 అని శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయభేరీ మోగించిన వైసీపీ.. ఈసారి ఏకంగా 175 స్థానాల్లో గెలిచి తీరాలంటున్నారు సీఎం జగన్. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు మేం సిద్ధం సభ లు ఏర్పాటు చేసిన జగన్.. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సెంటిమెంట్ ప్రకారం ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించి, ఆ తర్వాత జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు షురూ చేస్తారు.తొలి రోజు ప్రచారాన్ని కడప పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో నిర్వహించనున్నారు. తొలి రోజు యాత్రలో వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా జగన్ బస్సు యాత్ర సాగనుంది. ప్రొద్దుటూరులో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద రాత్రి శిబిరానికి చేరుకుంటారు. ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులోనే రాత్రికి సిఎం జగన్ బస చేస్తారు.
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఏకబిగిన మొత్తం 21 రోజులపాటు వైఎస్ జగన్ బస్సు యాత్ర సాగనుంది. యాత్రలో భాగంగా నిత్యం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రతి రోజూ ఉదయం ఆయా నియోజక వర్గాల్లోని వివిధ వర్గాలతో సమావేశం అవుతారు. ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు.అన్ని స్థాయిల వారి నుంచి సలహాలు, సూచనల స్వీకరించనున్నట్టు వైసీపీ వర్గాలు వెల్లడించారు. రోడ్ షోలతో పాటు అయా నియోజక వర్గ ప్రజల అకాంక్షలకు అనుగుణంగా సిఎం ప్రసంగాలు ఉండనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో బహిరంగ సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే 'సిద్ధం' సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో బస్సు యాత్ర జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉండగా నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర మాదిరే, బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికలకు ముందే రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం పేరుతో భారీ సభల్ని వైసీపీ నిర్వహించింది. ఉత్తరాంధ్రలోని భీమిలి, ఉత్తర కోస్తాలోని దెందులూరు, రాయలసీమలో రాప్తాడు, దక్షిణ కోస్తాలో మేదరమెట్లలో నాలుగు సభలు నిర్వహించారు.
ఎన్నికల వేళ జగన్ మళ్లీ బస్సు యాత్రలతో ప్రజల్లోకి వస్తుండటం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. 58నెలల పాలనా విజయాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధం అయ్యారు. నవరత్నాలతో పాటు నగదు బదిలీ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించిన మేలును ప్రజలకు నేరుగా వివరించనున్నారు. అదే సమయంలో విపక్షకూటమి తీరుపైనా జగన్ విరుచుకుపడనున్నారు.