టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ పై రెబల్గా పోటీ చేస్తున్న అతని భార్య..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ కుటుంబ రాజకీయాలుగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్కిలిలో మరొక కుటుంబ వివాదం రాజకీయాల రంగు పులుముకుంది. నామినేషన్ మొదలైన మొదటి రోజే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం లో అసలు సిసలైన రాజకీయం మొదలైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య భర్త పైన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతోంది.
జడ్పీటీసీ సభ్యురాలు వాణి ఆమె భర్తపైనే పోటీ చేస్తున్నట్టు తన అనుచరుల వద్ద ప్రకటించారు. గురువారం ఆమె జన్మదినం సందర్భంగా ఈనెల 22వ తారీఖున నామినేషన్ వేయబోతున్నట్లు ఆమె వెల్లడించారు. శుక్రవారం నాడు ఆమె భర్త వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను కాదని భర్తకు ఇచ్చిన కారణంగా.. దంపతుల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఆమె ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్ది కాలంగా ఈ దంపతులు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. మరోపక్క దువ్వాడ వ్యవహార శైలి తో నియోజకవర్గంలో రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఇదే విషయాన్ని వాణి సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఒకానొక సందర్భంలో టెక్కిలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా వాణిని నియమించారు.
వైసీపీ తన అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు వాణి పార్టీ తరఫున ఆ నియోజకవర్గంలో ఎంతో కష్టపడి పనిచేసింది. అయితే తనను కాదని శ్రీనివాస్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఇండిపెండెంట్ గా భర్త పైనే పోటీ చేయడానికి బరిలో దిగనున్నట్టు స్పష్టం చేశారు.