జగనన్నకు నవ సందేహాల లేఖ రాసిన షర్మిలక్క..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు తమ పార్టీకి సంబంధించిన ప్రచారాలలో బిజీగా ఉన్నారు. అయితే షర్మిల మాత్రం జగనన్నను టెన్షన్ పెట్టడమే పనిగా మార్చుకొని ముందుకు కదులుతున్నారు. ఆమె ప్రవర్తిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీలో కూడా అక్కడక్కడ అసంతృప్తి కనిపిస్తోంది. పర్సనల్ ఎజెండా హైలెట్ చేస్తూ సాగుతున్న షర్మిల ప్రచారాలు కాంగ్రెస్ పై ఇంపాక్ట్ తెస్తాయి అనేది వారి వాదన. అసలు విషయం ఏమిటంటే తాజాగా షర్మిల సీఎం జగన్ కు మరొక బహిరంగ లేఖను రాశారు. నవరత్నాలు అంటూ జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలను ఎద్దేవా చేస్తూ నవ సందేహాలు పేరుతో ఈ లేఖను పంపారు.
ఆ లేఖలో ఆమె రాసిన ఆ తొమ్మిది ప్రశ్నలకు జగన్ సమాధానం ఇవ్వాలి అంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. అంతేకాదు యువతకు జాబు కావాలి అంటే మీ పాలన పోవాలి అన్న విషయాన్ని మీరు అంగీకరిస్తారా అంటూ షర్మిల ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పలువురు ఆమె ప్రవర్తనను తప్పుపడుతున్నారు. రాష్ట్ర పాలన అనేది చిన్న పిల్లల ఆట కాదు.. ప్రతి ఒక్క విషయం లో ఎన్నో అంచనాలు.. అంతకుమించి ఎన్నో మంచి చెడులు ఆలోచించాల్సి ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడాలి అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి నేటి వరకు ప్రతి ముఖ్యమంత్రిని మనం అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. మరి వాటిలో చంద్రబాబు లేరా.. ఇప్పుడు షర్మిల వెనక వేసుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ లేదా.. ఇవన్నీ మర్చిపోయి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి షర్మిల ఇలా సోషల్ మీడియాలో హడావిడి చేయడం సరికాదు అని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇటువంటి వాటికోసం సమయం వృధా చేయడం కంటే కూడా షర్మిల తమ పార్టీకి సంబంధించిన కాన్వాస్ చేసుకుంటే రేపు కనీసం కాంగ్రెస్ కి కొంతైనా మేలు జరుగుతుంది అని భావిస్తున్నారు.