పౌరాణికం...పాటలతో అలరించిన టిఎల్సిఎ ఉగాది ఉత్సవాలు
న్యూయార్క్లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్సిఎ) ఆధ్వర్యంలో ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలను ఏప్రిల్ 20వ తేదీన అంగరంగ వైభవంగా జరిపారు. న్యూయార్క్లోని స్థానిక హిందూ టెంపుల్ సొసైటీ ఆడిటోరియంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఉగాది ప్రత్యేక సావనీర్ను శ్రీమతి సాధన మల్లారెడ్డిగారు ఆవిష్కరించారు. టిఎల్సిఎ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి పర్వతాల, చైర్ ఉమెన్ రాజి కుంచం, వైస్ ప్రెసిడెంట్ సుమంత్ రామ్ సెట్టి, సెక్రటరీ మాధవి కోరుకొండ, జాయింట్ సెక్రటరీ అరుంధతీ అడప, ట్రెజరర్ శ్రీనివాస్ సనిగెపల్లి, జాయింట్ ట్రజరర్ భగవాన్ నడిరపల్లి, ఇసి మెంబర్ లావణ్య అట్లూరి, సుధా మన్నవ తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు గోల్డ్ డోనర్స్గా డా. పైళ్ళ మల్లారెడ్డి, పూర్ణ, కృష్ణ మద్దిపట్ల వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో నిఖిల్ హాజరై తనదైన స్టయిల్లో అందరిని ఉత్సాహపరిచారు. తన హ్యాపీ డేస్ సినిమాలోని పాటతో, డాన్స్ తో అలరించారు. డిజిటల్ స్క్రీన్, ఫోటో బూత్ మంచి రిచ్ లుక్ ని తీసుకొచ్చాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, నృత్యాలు, తెలుగు సినిమా పాటలు, విందు భోజనం అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్ పి పట్నాయక్ ట్రూప్ మ్యూజికల్ కాన్సర్ట్ ఈ వేడుకల్లో మరో ప్రత్యేకత నిలిచింది. టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్స్ శ్రీకాంత్, శృతి తమ పాటలతో అలరించారు. సాహిత్య వింజమూరి తన వ్యాఖ్యానంతో కార్యక్రమాలకు అదనపు ఆకర్షణలను అందించారు. మద్దిపట్ల ఫౌండేషన్ వారు రాఫుల్ బహుమతులు స్పాన్సర్ చేశారు.
ఈ ఉగాది వేడుకల్లో మరో ప్రత్యేకంగా నిలిచిన కార్యక్రమం...బాల రామాయణం. అసలు సిసలైన వాల్మీకి రామాయణాన్ని అమెరికాలో పుట్టిన పెరిగిన చిన్నారులకు వివరించి, వారితోనే నాటిక రూపంలో ప్రదర్శింప జేసే బృహత్తర కార్యక్రమాన్ని ఉగాది వేడుకలలో టిఎల్సిఎ నిర్వహించి అందరిచేత శెభాష్ అనిపించుకుంది. ఈ కార్యక్రమానికి అశోక్ చింతకుంట, ప్రసాద్ దబ్బీరు, మాధవి సోలేటి దర్శకత్వం వహించడంతోపాటు చిన్నారులకు అవసరమైన శిక్షణను ఇచ్చి వారి చేత ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రదర్శింపజేశారు.
మన భావి తరాల వారికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయటం, మన ఇతిహాసాల మీద అవగాహన కలిగించడం, మన విలువలు తెలియజెప్పటం మరియు మన భాష ను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు కిరణ్ రెడ్డి పర్వతాల తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ టిఎల్సిఎ కార్యవర్గం ధన్యవాదాలను తెలియజేసింది.