ఒకే వీధి కానీ రెండు రాష్ట్రాలు.. సరికొత్త ఎన్నికల విచిత్రం..
రాష్ట్రాలు.. జిల్లాలు విభజించిన తరువాత ఒకే ఊరు రెండు వేరువేరు జిల్లాల పరిధిలోకి రావడం.. లేక రెండు రాష్ట్రాల పరిధిలో రావడం మనం గమనిస్తున్నాం. అయితే ఒకే వీధి రెండు రాష్ట్రాల పరిధిలో రావడం ఇంతవరకు ఎప్పుడు విని ఉండము. ఇలాంటి చిత్రం ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలో చోటుచేసుకుంది. భద్రాచలంలోని ఒక వీధి ఒకవైపు తెలంగాణ పరిధిలోకి వెళ్తే.. మరోవైపు ఆంధ్ర పరిధిలోకి వస్తుంది. ఇదే విచిత్రం అనుకుంటే అంతకంటే విచిత్రం మరొకటి ఉంది.. ఆ వీధిలో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న తండ్రి కొడుకులు ఒకరు తెలంగాణ కు చెందితే మరొకరు ఆంధ్రా లోకి వస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆసక్తికరమైన ఘట్టం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో భాగమైన ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ తన గృహాన్ని నిర్మించుకున్నాడు. రాష్ట్ర విభజన అనంతరం రాజుపేట లోని ఒక వీధి తెలంగాణలోని మెహబూబాబాద్ లోక్సభ పరిధిలోకి వెళ్ళింది. మరొకవైపు ఉన్న ప్రాంతం ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా .. అరకు నియోజకవర్గ పరిధిలోకి వెళ్ళింది. దీంతో శ్రీనివాసు ఇల్లు అరకు లోక్సభ స్థానం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం లోకి వెళ్ళగా.. అదే వీధిలో తండ్రి ఇంటికి ఎదురుగా రోడ్డుకు అవతల వైపున గృహం నిర్మించుకున్న శ్రీనివాస్ కొడుకు జానకీరామ్ తెలంగాణ వాస్తవ్యుడు అయ్యాడు. మనం చూస్తున్న ఎన్నికల చిత్రాలు విచిత్రాలలో ఈ సరికొత్త ఘట్టం వైరల్ అవుతుంది.