ఈ మే మరింత హాట్ గురూ....
ఎండ మండిపోతోంది. దేశం నిప్పులకొలిమిలా మారింది. ఉదయం 8 గంటలు దాటేసరికే.. టెంపరేచర్ రివ్వున పైకెగసిపోతోంది. . దీంతో జనం బయటకు రావాలంటే వణికిపోతున్న పరిస్థితి ఉంది. మండుటెండల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాదారణమయ్యాయి. ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు నిరంతరాయంగా తిరుగుతున్నా, సాంత్వన లభించడం లేదు. ఈ సారి సమ్మర్ మరింతహాట్ గా ఉందంటున్న వాతావరణశాఖ హెచ్చరికలు దేశవాసులను బెంబేలెత్తిస్తున్నాయి.
ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే మేఘాలయ వరకు రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో బయటికి రావాలంటేనే ప్రజలు వణికి పోతున్నారు. ఏప్రిల్ నెల అలా ఉందంటే.. మే లో సూర్యుడు జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 8 దాటితే చాలు రోడ్లమీద అనధికార కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోంది. ఇక దేశవ్యాప్తంగా వడ దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మే నెల మొదటివారంలోనే ..ఎండలు రికార్డు స్థాయిలో దంచి కొట్టాయి. అయితే రానున్న రోజుల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
123 ఏళ్ల తర్వాత..
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇలా నమోదు కావడం ఇది రెండవసారి. 1901 సంవత్సరం లో ఏప్రిల్ నెలలో తొలిసారిగా ఇదే స్థాయిలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. వాస్తవానికి ఏప్రిల్ నెలలో వడగాలులు వీచడం అనేది ఉండదు. మే ప్రథమార్థం లేదా ద్వితీయార్థంలో వడగాలులు వీచడం పరిపాటి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే వడగాలులు విపరీతంగా వీచాయి.. ఇక ప్రస్తుత మే నెలలో కూడా విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని,వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.. దేశవ్యాప్తంగా 11 రోజులపాటు హీట్ వేవ్స్ కొనసాగుతాయని వివరిస్తున్నారు.
1901 తర్వాత మళ్లీ ఈ స్థాయిలో ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి. 1980 నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్ లోని దక్షిణ ప్రాంతం, మధ్యప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతం, మహారాష్ట్రలోని విదర్భ, మరాఠవాడ, గుజరాత్ లోని ఖచ్ ప్రాంతంలో 8 నుంచి 11 రోజులపాటు వేడి గాలులు వీస్తాయని”భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో అయితే నిప్పుల వర్షం కురుస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి కిందకు దిగడం లేదు. సాయంత్రం ఆరుగంటలకు బయటకు వస్తున్న జనానికి వడగాలులు భయపెడుతున్నాయి. రాత్రి పదిగంటలవరకూ వడగాలుల తీవ్రత కనిపిస్తోంది. దీంతో పదుల సంఖ్యలో జనం వడగాలులకు బలవుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు.