న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిడులు సహించలేం.. సీజేఐకి 600 మంది లాయర్ల బహిరంగ లేఖ
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పొలిటికల్ అజెండాతో స్వార్థ ప్రయోజనాల కోసం తీర్పులను ప్రభావితం చేసేలా కొంతమంది ఈ ఒత్తిళ్లకు దిగుతున్నారని న్యాయవాదులు ఆరోపించారు. ఈ మేరకు సుమారు 600 మందికి పైగా లాయర్లు గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్కు ప్రత్యేక లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీల నేతలు జైలు పాలవుతున్న సమయంలో ఈ లేఖ రాయడం తీవ్ర దుమారం రేపుతోంది.
దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హరీశ్ సాల్వే, పింకీ ఆనంద్ వంటి ప్రముఖ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా కొంతమంది ఒత్తిళ్లకు దిగుతున్నారని ఆరోపించారు. ‘‘రాజకీయ అజెండాతో స్వార్థ ప్రయోజనాలు ఆశిస్తూ కొన్ని గ్రూప్లు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసి, కోర్టు ప్రతిష్ఠను సైతం దెబ్బతీయాలని చూస్తున్నాయి. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల ద్వారా వెలువడిన కీలక తీర్పులపైనే తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయి. ఇది మన న్యాయవ్యవస్థని దెబ్బతీసే అవకాశం ఉంది" అంటూ సీజేఐకి రాసిన లేఖలో లాయర్లు పేర్కొన్నారు.
‘‘రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత వారినే కోర్టుల్లో సమర్థించడం వింతగా ఉంది. ఇక కొందరు న్యాయవాదులు కూడా ఉదయం రాజకీయ నాయకులను సమర్థిస్తున్నారు. రాత్రి మీడియాను ఉపయోగించుకుని న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇక కొంతమంది నాయకులైతే కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాని పక్షంలో బహిరంగంగానే న్యాయవ్యవస్థపై విమర్శలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదు. అనుమతించకూడదు. ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే.. హాని చేయాలనుకునేవారికి మరింత బలం చేకూరుతుంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవ్యవస్థను పరిరక్షించాలని సుప్రీంకోర్టును కోరుతున్నాం.’’ అని న్యాయవాదులు కోరారు.