అనపర్తి 'నల్లమిల్లి'దే...
అనపర్తి సీటు అభ్యర్థి విషయమై ఉత్కంఠకు తెరపడింది. కూటమి తరపున పోటీ చేయాలని భావించి, చివరివరకూ పోరాడిన నల్లమిల్లి...ఎట్టకేలకు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రయత్నాలు ఫలించడంతో.. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నల్లమిల్లి. కూటమి పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి కేటాయించారు. అయితే అక్కడ బీజేపీకి సరైన అభ్యర్థి లేరు. మరోవైపు.. ఈ టికెట్ తనకే కేటాయించాలంటూ నల్లమిల్లి పట్టుబట్టడంతో.. ఇది కూటమికి తలనొప్పిగా తయారైంది.
అనపర్తి సీటుకోసం నల్లమిల్లి పట్టుపట్టడంతో టీడీపీ హైకమాండ్ సమాలోచనలు చేసింది. బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపినా.. వారు ససేమిరా అనడంతో అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే సమీకరణలు ఫలించకపోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి .. పురంధేశ్వరి దంపతులను కలిశారు. సుదీర్ఘ మంతనాల తర్వాత బీజేపీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు నల్లమిల్లి.
పొత్తులో భాగంగా సీటు బీజేపీకి వెళ్లడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళనకు దిగారు. కుటుంబంతో కలిసి మండలాల్లో ప్రజలను కలుస్తూ ముందుకెళ్లారు. ప్రజల నుంచి సానుభూతి రావడం, నల్లమిల్లి ఆందోళనలు పార్టీకీ చేటు తెచ్చేప్రమాదం కనిపించడంతో టీడీపీ హైకమాండ్ సమాలోచనలు చేసింది. ఎన్నికల తర్వాత మంచి పదవి కట్టబెడతామంటూ హామీ ఇచ్చినప్పటికీ .. నల్లమిల్లి వెనక్కి తగ్గలేదు. ఈ వ్యవహారాన్ని పరిష్కరించే ఉద్దేశ్యంతో చంద్రబాబు, బీజేపీ నేతలతో చర్చించారు. చివరకు బీజేపీ ఆహ్వానంతో నల్లమిల్లి.. కమలంలో పార్టీలో చేరారు.
ఇక ఈ సీటుపై పురంధేశ్వరి ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం వెనక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈఅనపర్తి .. పురంధేశ్వరి ఎంపీగా పోటీ చేస్తున్న రాజమండ్రి లోక్ సభ స్థానం పరిధిలోకి వస్తుంది.ఇక్కడ కనుక గట్టి అభ్యర్థి బరిలో నిలవకుంటే, ఫలితంగా తనకు తక్కువ మెజార్టీ వచ్చేప్రమాదముంది. అందుకే అనపర్తి సీటుపై పురంధేశ్వరి ప్రత్యేక శ్రద్ధ కనబరిచినట్లు సమాచారం. నల్లమిల్లిని ఏరికోరి, పార్టీలో జాయిన్ చేసుకున్నారు పురంధేశ్వరి. దీనిపై పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వస్తున్నా పురంధేశ్వరి పట్టించుకోలేదు.