పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి.. నిరసనకారులకు నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్..
కూటమిలో భాగంగా టికెట్లు దక్కని నేతలు వారికి సంబంధించిన అభ్యర్థులు పార్టీలో నిరసన మొదలుపెట్టారు. ఈ విషయం చిలికి చిలికి గాలి వాన కాకుండా ఉండడం కోసం కూటమిలోని మూడు పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరోపక్క సంవత్సరాలుగా పార్టీ కోసం పని చేస్తూ జండా మోస్తూ ఎంతో కష్టపడినప్పటికీ టికెట్టు రాకపోవడంపై.. కొందరు నేతలు విపరీతమైన బాధ వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా జనసేనలో టికెట్ వస్తుంది అన్న ధీమాతో కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డ నాయకులు వారి అనుచరులు కూటమికి పెద్ద సమస్యగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు రంగంలోకి దిగి ఓ భారీ వార్నింగ్ ఇచ్చేశారు. జనసేన పార్టీ తరఫున 20 మంది అభ్యర్థుల ఎంపిక విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని.. పార్టీ అధ్యక్షుడిగా అతని నిర్ణయమే తుది నిర్ణయం అని.. ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అర్థం చేసుకోవాలని తెలియపరిచారు. పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాల గురించి ఇలా బహిరంగంగా వేదికల మీద, మీడియా ముందు మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తాం అని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.