నీ నిర్ణయం ఏదైనా పాటిస్తాం.. తమ్ముడి పై నాగబాబు ఎమోషనల్ పోస్ట్..
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అనే ఉద్దేశంతో ఏపీలో కూటమిగా ఏర్పడి.. అవిశ్రాంత పోరాటం చేసిన జనసేన అధినేతకు చంద్రబాబు చివరికి అన్యాయం చేశాడు. కేవలం అతని 22 సీట్లకు పరిమితం చేసి ఎందరో జనసైనికులకు నిరాశ మిగిల్చాడు. మరోపక్క పవన్ సొంత అన్న నాగబాబు సైతం ఈ రాజకీయ చదరంగంలో పావుగా మారాడు. ఇంత జరిగినా ఇంకా ప్రజల కోసం కూటమికి కట్టుబడి పవన్, తమ్ముడికి కట్టుబడి నాగబాబు ముందుకు సాగుతున్నారు. పార్టీలో తమకు సీటు రాలేదు అన్న అసంతృప్తితో చాలామంది జనసేన ను వీడుతున్నారు. కొందరు పార్టీలో ఉన్నప్పటికీ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జనసేనలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తూ.. పార్టీని కలిసికట్టుగా ముందుకు నడిపే నాగబాబు విశాఖ జిల్లా, అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అక్కడే ఉంటూ గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. కానీ చివరికి కూటమిలో భాగంగా ఆస్థానం బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని భావించినా ..అది కూడా కుదరలేదు. ఆ టైంలో సైలెంట్ అయిపోయిన నాగబాబు ఇప్పుడు పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలకు దిశా నిర్దేశం చేయడానికి అన్నట్లుగా.. తను నీరసించి ఉన్న సమయంలో పవన్ భుజం మీద చేయి పెట్టి ఓదారుస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోని పోస్ట్ చేశాడు. దానితోపాటుగా ”నీ ఉద్దేశం ఏదైనా.. నీ ఆదేశం ఏదైనా.. ఎటువంటి ప్రశ్నలు అడగకుండా పాటించే లక్షల మంది జనసైనికులు నేను కూడా ఒకడిని. నీ నిర్ణయం నా భుజం మీద ఉన్న నీ చేయి లాంటిది.. అది బలాన్ని, భరోసాని ఇస్తుంది తప్ప బరువుని బాధను ఎప్పటికీ ఇవ్వదు.” అని ఓ ఎమోషనల్ క్యాప్షన్ కూడా పెట్టారు.