బూతులను తెలంగాణ అధికారిక భాషగా మార్చిందే కేసీఆర్.. సీతక్క ఫైర్
రాజకీయాల్లో బూతులకు ఆద్యుడు కేసీఆరేనని, తెలంగాణ రాష్ట్రంలో బూతులను అధికారిక భాషగా మార్చిన ఘనత ఆయనదేనని రాష్ట్ర మంత్రి సీతక్క మండిపడ్డారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సీతక్క .. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ తన దురహంకార భాషను వదిలిపెట్టడం లేదని, ఇప్పటికీ అదే అహంకారంతో మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. ప్రజలు పదేళ్ళపాటు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు ఓటమి తప్పదని జోస్యం చెప్పిన సీతక్క.. ఆ పార్టీకి మళ్లీ షాక్ తప్పదన్నారు.
‘‘ప్రస్తుతం ఒక్క సీటైనా గెలుచుకునేందుకు బీఆర్ఎస్ నేతలు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తాం అని చెప్పగలిగే నియోజకవర్గం ఒక్కటి కూడా లేదు. పరిస్థితి ఎలా మారిపోయిందో చూసుకోండి. అహంకారం పెరిగిన నేతలను ప్రజలు పక్కన పెట్టడం రాజకీయాల్లో కామన్’’ అని సీతక్క హితబోధ చేశారు. అలాగే ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.