ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 కేసీఆర్, ఏ2 కేటీఆర్: కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కానిస్టేబుల్ బదిలీ కావాలన్నా కేసీఆర్, కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వల్సి వచ్చేదని, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఏ1, ఏ2 ముద్దాయిలు వాళ్లిద్దరేనని, త్వరలోనే వాళ్ళిద్దరూ కటకటాలు లెక్కపెడతారని మధుయాష్కీ విమర్శించారు. "తిండి లేకుండా బతకొచ్చు కానీ స్వేచ్ఛ లేకుండా బతకలేం. మానవ హక్కులను కాలారాస్తూ ట్యాపింగ్ చేయడం క్షమించరాని నేరం. అలాంటి నేరానికి పాల్పడిన వారికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే. నిందితులు జైలు శిక్ష అనుభవించాల్సిందే" అని కాంగ్రెస్ నేత మధుయాష్కీ పేర్కొన్నారు.
అనంతరం ఎన్నికల్లో తన పోటీ విషయంపై మాట్లాడుతూ.. తనను భువనగిరి నుంచి పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి కోరినట్లు చెప్పారు. అలాగే తనను గెలిపించుకునే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటానన్నారని, కానీ తనకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పానన్నారు. "స్వాతంత్ర్యానంతరం దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారంతా నక్సలిజం వైపు అడుగులు వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలవారు రాజ్యమేలారు. తెలంగాణ సాధించుకున్నాక రావులు రాజ్యం ఏలారు. కానీ ఇప్పుడు కాలం మారింది. పాలన కాంగ్రెస్ చేతికొచ్చింది. ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా జరుగుతోంది" అని మధుయాష్కీ చెప్పుకొచ్చారు.