కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్: KTR
లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ మారిపోతారన్నారు బీఆరెస్ నేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. రేవంత్ జీవితమంతా కాంగ్రెస్లోనే ఉంటానని ఏనాడు చెప్పలేదని, బీజేపీతో ఆయనకు లోపాయకారి ఒప్పందాలున్నాయని, ఎన్నికలు ముగియగానే బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు రేవంత్కు భయపడేవారు ఎవ్వరూలేరని, ఆయన తమను ఏం చేయలేరని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ భవన్ వేదికగా మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్ నాయకత్వంపై నిప్పులు చెరిగారు. జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ బిల్డర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని, అందుకే 3 నెలలుగా బిల్డింగ్లకు అనుమతులు ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న రేవంత్రెడ్డి దాదాపు రూ.2500 కోట్లను ఢిల్లీకి పంపించారని ఆరోపించారు.
అనంతరం ఫోన్ టాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే సీఎం రేవంత్ విచారణ చేయించాలని, విచారణలో తప్పు జరిగిందని తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడంపై మీడియా ప్రశ్నించగా.. ఆయన పార్టీ వదిలిపోవడంతో తమకు ఏం నష్టం లేదన్న కేటీఆర్.. నాగేందర్ అవకాశవాద రాజకీయాల కోసం కాంగ్రెస్లోకి వెళ్లారని, అధికారం కోసం ఆశపడి, గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి కాంగ్రెస్లోకి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3, 4 నెలల్లో ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందని, ఆ ఎన్నికల్లో ద్రోహం చేసిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ని గెలిపించి, నాగేందర్ నిర్ణయం తప్పని నిరూపించాలని పిలుపునిచ్చారు.