ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు: ఎర్రబెల్లి
ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు తనకు తెలియదని తెలిపారు. ప్రణీత్రావు బంధువులు తమ ఊరిలో ఉన్నారని, వారికి ఏ పార్టీతో సంబంధం ఉందో విచారణ చేస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీ మారాలంటూ కొందరి ద్వారా తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. టీడీపీలో ఉన్నప్పుడూ తెలంగాణ కోసం పోరాడానన్న ఎర్రబెల్లి, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి మచ్చ లేదని తెలిపారు. ఇరికించాలని ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. ఇబ్బంది పెట్టాలనే తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆక్షేపించారు. తనపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తెలియదన్నారు. భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని బీజేపీ నుంచి ఆయన్ను తొలగించినట్లు తెలిసిందని చెప్పారు. నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని అతడిపై ఎన్నో కేసులు ఉన్నాయన్నారు. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించవద్దని కోరారు.