లోకేశ్ను చంద్రబాబు మంగళగిరికే పరిమితం చేశారా..?
తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ ఎవరంటే వినిపించే పేరు లోకేశ్. చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేదెవరంటే చెప్పే పేరు లోకేశ్. చంద్రబాబు తర్వాత పార్టీ తరపున సీఎం ఎవరవుతారంటే చెప్పే పేరు లోకేశ్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు లోకేశ్. అలాంటాయన ఈ ఎన్నికల సమయంలో ఎంతటి కీలక పాత్ర పోషించాలి..? రాష్ట్రమంతా చుట్టేయాలి.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఫుల్లుగా ప్రచారం చేయాలి. ఎన్నికల షెడ్యూల్ రాకముందు వరకూ ఫుల్ యాక్టివ్ గా కనిపించిన లోకేశ్.. ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు. కేవలం మంగళగిరికి మాత్రమే పరమితమైపోయారు. ఎందుకిలా..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వయసు మళ్లుతోంది. దీంతో ఆయన బాధ్యతలను లోకేశ్ భుజానికెత్తుకున్నారు. 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీకోసం లోకేశ్ ఎక్కువ సమయం కేటాయించారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కేడర్ తో సమన్వయం చేసుకుంటూ.. నియోజకవర్గాల్లోని సమస్యలను పరిష్కరిస్తూ.. ముందుకు సాగారు. పార్టీ గెలుపుకోసం వ్యూహకర్తలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ స్ట్రాటజీలను రూపొందించారు. ఈ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ ముందుంటారని అందరూ అనుకున్నారు.
కానీ అలా జరగట్లేదు. ఈ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ ఎక్కడా కనిపించడం లేదు. కేవలం మంగళగిరికి మాత్రమే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన లోకేశ్.. ఈసారి ఘన విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మంత్రి హోదాలో ఉండి పోటీ చేసి ఓటమి పాలవడం.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమితో తిరుగుముఖం పట్టడం లోకేశ్ కు అస్సలు రుచించలేదు. అందుకే ఈసారి గెలుపు కూడా తన గురించి మాట్లాడకోవాలనేది లోకేశ్ ఆలోచనగా ఉంది. అందుకే మంగళగిరిలోనే మకాం వేసం రోజూ ప్రజల దగ్గరకు వెళ్తున్నారు.
లోకేశ్ ను చంద్రబాబు మంగళగిరికి మాత్రమే పరిమితం చేశారని విమర్శించే వాళ్లూ ఉన్నారు. కానీ ఇది వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయంగానే పార్టీ చూస్తోంది. చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంటే పార్టీ హెడ్ క్వార్టర్స్ లో లోకేశ్ మకాం వేసి నిత్యం పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎక్కడైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచారానికి సంబంధించిన స్ట్రాటజీలను కూడా లోకేశ్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబుపై సగం భారం తీరింది. లోకేశ్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆయన్ను మంగళగిరికి మాత్రమే పరిమితం చేశారని కొందరు అనుకుంటున్నారు. కానీ అది వ్యూహాత్మక నిర్ణయం అని పార్టీ చెప్తోంది.