మైనార్టీ ప్రాపర్టీలా కాంగ్రెస్ మేనిఫెస్టో: ధర్మపురి అర్వింద్
లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో మైనార్టీ ప్రాపర్టీలా ఉందంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులను దోచి ముస్లింలకు పంచి పెట్టేలా మేనిఫెస్టో రూపొందించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన అర్వింద్.. భారతదేశం బలమైన శక్తిగా ఎదగడాన్ని కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతోందని, అందుకే దేశాన్ని బలహీనపర్చడానికి ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు.
కాగా.. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ సమర్థుడే కానీ, కాంగ్రెస్లోనే ఉంటే ఆయన అసమర్థుడిగా మారిపోతారని అన్నారు. ‘‘రేవంత్ రెడ్డికి చాలా రాజకీయ జీవితం ఉంది. మరో 15 ఏళ్లపాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు. కానీ ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం భవిష్యత్తు శూన్యం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. రేవంత్ బీజేపీలో చేరితే బాగుంటుంది. రేవంత్ బీజేపీలోకి వస్తే ఓ స్నేహితుడిలా స్వాగతిస్తా’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మపురి అర్వింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.