ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు ఊరట
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్.. జైలు నుంచే సీఎంగా కొనసాగడం, ప్రభుత్వాన్ని నడపడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ విషయంలో కేజ్రీవాల్ను అడ్డుకోవడం సాధ్యం కాదని, న్యాయపరంగా అందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సీఎంగా కొనసాగుతుండడాన్ని వ్యతిరేకిస్తూ, ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం కేజ్రీవాల్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. పాలనాపరమైన విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ‘‘జైలు నుంచి సీఎంగా కొనసాగడంలో ఆచరణాత్మక ఇబ్బందులు ఉండవచ్చు. కానీ, సీఎంగా కొనసాగడానికి న్యాయపరమైన అడ్డంకులు ఏమీ లేవు. ఒకవేళ ఏమైనా ఉన్నాయని మీకనిపిస్తే చెప్పండి’’ అంటూ పిటిషనర్ను ప్రశ్నించింది.
ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ స్కాం కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయగా.. కోర్టు ఆయనకు 6 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టు కావడానికి ముందు నుంచి ఆప్ నేతలు జైలుకెళ్లినా ఆయనే తమ సీఎంగా కొనసాగుతారని చెబుతూ వచ్చారు. దాని ప్రకారమే జైలులో ఉన్నప్పటికీ అక్కడి నుంచే పాలన కొనసాగిస్తున్నారు కేజ్రీవాల్. ప్రభుత్వ పరమైన ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. కేజ్రీవాల్ తీరును తప్పుబట్టిన ఎల్జీ.. ఢిల్లీ ప్రభుత్వం జైలు నుంచి నడవదని పేర్కొన్నారు.