వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరెండం : రేవంత్
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పాలనకు రెఫరెండంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు ప్రచార శంఖారావాన్ని పూరించబోతున్నట్టు తెలిపారు. తుక్కుగూడ రాజీవ్గాంధీ ప్రాంగణంలో జరిగే జనజాతర సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కనీసం 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్టు స్పష్టం చేశారు. అధిష్ఠానం అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే చేవెళ్లకు రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్కు దానం నాగేందర్లను అభ్యర్థులుగా ప్రకటించిందని తెలిపారు.