తెలుగింటి ఆడపడుచులకు తెలుగుదేశం ఆడబిడ్డ కానుక..
ప్రజాగళం యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న చంద్రబాబు ఈరోజు అనంతపురం జిల్లాకు వచ్చారు.బుక్కరాయసముద్రంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ ఆయన సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తమ పార్టీ అని పేర్కొన్నారు. తాము రూలింగ్ లోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు. అప్పు చేస్తే వడ్డీ కట్టాలని.. అలా వడ్డీలు కడుతూ పోతే అప్పు పెరగడమే తప్ప కరిగేది లేదని.. ఇలా అప్పుల సుడిగుండంలో చిక్కుకొని ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోతోందని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంగా డ్వాక్రా సంఘాలను స్థాపించి ఆడబిడ్డల పురోగతికి పాటుపడింది తమ పార్టీ అన్న విషయం గుర్తు చేశారు. తెలుగింటి ఆడపడుచులకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు అందిస్తామని చంద్రబాబు తెలియపరిచారు. కుటుంబంలో ఒక మహిళకే కాకుండా ఎందరో ఆడబిడ్డలు ఉంటే అందరికీ వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నామని తెలియపరిచారు. వీటికి ఎవరి రికమండేషన్లు అవసరం లేదని నేరుగా మీ ఖాతాలోకే పడుతుందని హామీ ఇచ్చారు.. వీటితో పాటుగా బాబు సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.