జగన్ ప్రజల్లోకి వస్తే నిన్ను దోషి లాగా చూస్తారు.. చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు సభలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ సీఎం జగన్ పై ఆయన ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక పచ్చి అబద్దాలకోరని.. బోగస్ సర్వేలు నిర్వహిస్తూ పేటీఎం బ్యాచ్ తో తమపై ,తమ కార్యకర్తలపై దాడులు చేయిపిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కల్పించి ప్రజలను మాయ చేస్తున్నాడని అన్నారు. జగన్ కి ధైర్యం ఉంటే తన తండ్రి వైయస్ సమాధి దగ్గరకు బాబాయిపై గొడ్డలివేటు వేసిన వాళ్ళని తీసుకు వెళ్ళమని సవాలు విసిరారు. అవినాష్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నప్పటికీ.. అతనికి టికెట్ ఇచ్చిన వైనంపై చంద్రబాబు విమర్శించారు. ఎవరిపై అయినా నిందలు ఉంటే.. అవి తేలేక టికెట్ ఇవ్వాలి అంతేకానీ ఇలా మధ్యలో ఇవ్వడం ప్రజలను అవహేళన చేసినట్లే అవుతుంది అని చంద్రబాబు అన్నారు. పేదల మనిషి అని చెప్పుకొని తిరిగే పెత్తందారు జగన్ అని ఆరోపించిన చంద్రబాబు ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ని రద్దు చేసిన వ్యక్తి పేదల మనిషి ఎలా అవుతాడు అని ప్రశ్నించారు. ఈసారి తమ గెలుపు ఖచ్చితం అన్న ధీమా చంద్రబాబులో గట్టిగా కనిపిస్తుంది. మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.