కాంగ్రెస్ వైపు కేకే చూపు..
బీఆర్ఎస్ పతనం శరవేగంగా కొనసాగుతోందా..? కేసీఆర్ అత్యున్నతంగా గౌరవించిన నేతలు సైతం.. గాలివాటం బట్టి ప్రవర్తిస్తున్నారా..? పార్టీ సంక్షోభ సమయంలో రెక్కలు చాచి ఎగిరేందుకు ప్రయత్నిస్తున్నారా..? అంటే అదేనని అనిపిస్తోంది.సీఎం కేసీఆర్ .. కె.కేశవరావు కుటుంబానికి పార్టీలో అమితప్రాధాన్యమిచ్చారు. ఆయనకు పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చిగౌరవించారు. ఆపై రాజ్యసభ ఎంపీగాను అవకాశమిచ్చారు. బిడ్డను హైదరాబాద్ మేయర్ గా ఎంపిక చేశారు.
ఇక పార్టీనేతల ఎంపికలోనూ కేకే మాటకు అమిత ప్రాధాన్యమిచ్చారు. చాలా వరకూ పార్టీనేతలకు సమస్యలు వస్తే, కేకే సలహాలతోనే హైకమాండ్ ను కలిసేవారని చెబుతారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లు కూడా కేకే మాటకు విలువ ఇచ్చేవారు. అలాంటి కేకే కుటుంబం ఇప్పుడు పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో... కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు.. గులాబీ పార్టీని కుదిపేస్తున్నాయి.
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ కంచర్ల కేశవ రావుపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కేకే వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది’’ అంటూ ఆయన వద్దే అసహనం వ్యక్తం చేశారు. కేశవరావు వచ్చి కలిసిన సందర్భంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ భేటీ అనంతరం కేకే కూడా తీవ్ర అసహనంతో ఇంటికి వెళ్లిపోయారు. ఇక కేకే నివాసానికి మాజీ ఇంద్ర కరణ్ రెడ్డి వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్లో చేరడంపై బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు కీలక ప్రకటన చేశారు.
కాంగ్రెస్ తనకు సొంత ఇళ్లులాంటిదని చెప్పారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారని.. తాను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్లో చేరుతానని స్పష్టం చేశారు. 53ఏళ్లు కాంగ్రెస్లో పని చేశానని అన్నారు. బీఆర్ఎస్లో తాను పని చేసింది కేవలం పదేళ్లు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరానని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిందన్నారు. తాను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యానని కేశవరావు తేల్చిచెప్పారు. కాగా కేకే కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. శనివారం ఆమె పార్టీలో చేరబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. అయితే విజయ పార్టీలో చేరిన రోజున తాను కాంగ్రెస్ లో చేరడం లేదన్నారు కేకే. తన కొడుకు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉంటారని తెలిపారు కేకే.