ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రేవంత్ కి చేరికల మీద ఉన్న దృష్టి రైతు సమస్యలపై లేదు: హరీష్ రావు

రేవంత్ కి చేరికల మీద ఉన్న దృష్టి రైతు సమస్యలపై లేదు: హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డికి చేరికలపై ఉన్న ఆసక్తి రైతు సమస్యలపై లేదని బీఆరెస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ దీనిపై సీఎంకు ఏ మాత్రం బాధ లేదని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌ వేదికగా ఆయన సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదివారం తాను దేవరుప్పుల మండలం లక్ష్మీబాయి తండాకు వెళ్లానని.. అక్కడ ఉన్న రైతులు కన్నీళ్లతో పలుకరించారని, వారి బాధను తాను ప్రత్యక్షంగా చూశానని అన్నారు.

"ఓ రైతు నాలుగు బోర్లు, మరో రైతు 6 బోర్లు వేసినా పడలేదని రైతులు ఆవేదనగా చెప్పారు. తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల దుస్థితి అలా ఉన్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. అన్నదాతలు ఇబ్బందుల్లో ఉంటే దృష్టి మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం చిల్లర ప్రయత్నాలు చేస్తోంది. సీఎం రేవంత్ ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్లి బతిమాలి కండువాలు కప్పుతున్నారు. రేవంత్‌కు పక్క పార్టీల నేతలను తన పార్టీలో చేర్చుకోవడంపై ఉన్న దృష్టి రైతు సమస్యలపై, వాటిపరిష్కారంపై లేదం"టూ మండిపడ్డారు.

"ఓ వైపు రైతులు అప్పులు కట్టాలని బ్యాంక్ అధికారులు లీగల్ నోటీసులు ఇస్తున్నాయి. ‘బకాయిలు కడతారా లేదా..?‘ అంటూ బ్యాంకు అధికారులు రైతులను బెదిరిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన సీఎం మాట తప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే రేవంత్ ప్రభుత్వం రైతులను దగా చేసింది" అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అంతే కాకుండా.. ఇచ్చిన 4 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రభుత్వం రైతులకు మోసం చేసిందని హరీష్ రావు మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతు సమస్యలపై దృష్టి పెట్టాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తుల సహాయానికి ఎన్నికల కోడ్ అడ్డురాదని, రూ.2 లక్షల రుణమాఫీని వెంటనే అందజేయాలని కోరారు. రైతు రుణమాఫీ జరిగే వరకు పోరాడుతామన్నారు. రేవంత్ ప్రభుత్వం స్పందించకుంటే రైతులతో కలిసి సెక్రటేరియట్ ముట్టడిస్తామని, వడ్లకు రూ.500బోనస్ ఇచ్చేదాకా ప్రభుత్వం వెంట పడతామని హెచ్చరించారు. అనంతరం రైతులు ఎవరూ బ్యాంక్ అప్పులు కట్టోద్దని సూచించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. మంగళవారం నుంచి బీఆర్ఎస్ నేతలు పంట పొలాలకు వెళ్లాలని కేసీఆర్ ఆదేశించినట్లు రైతులకు చెప్పారు. ఏ గ్రామంలో ఎంత నష్టం జరిగిందో వివరాలు కేంద్ర కార్యాలయానికి పంపించాలన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :