వారికి పౌరసత్వం ఇస్తామంటే హస్తం పార్టీ.. వ్యతిరేకిస్తోంది : లక్ష్మణ్
అంబేడ్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.350 కోట్లతో స్ఫూర్తి, దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంబేడ్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేశామని, భారతరత్నతో గౌరవించినట్లు చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే పాక్ అధీనంలోకి పీవోకే వెళ్లింది. అయోధ్య నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంది. శ్రీరాముడిని అవమానించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ వేళ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణను ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకించింది. కొత్తగా సీఏఏపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. పాక్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్లో మైనార్టీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు మత హింసకు గురవుతున్నారు. శరణార్థులుగా భారత్కు వస్తామని వేడుకుంటున్నారు. వారికి పౌరసత్వం ఇస్తామంటే హస్తం పార్టీ వ్యతిరేకిస్తోది. సీఏఏను మతంతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆరోపిస్తున్నారు అని అన్నారు.