బాల్టిమోర్ వంతెన ప్రమాదం...స్పందించిన బైడెన్
బాల్టిమోర్లో పటాప్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాల్టిమోర్లోని పటాప్స్కో నదిలో మంగళవారం తెల్లవారు జామున ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన పేకమేడలా కూలిపోయింది. వంతెన పిల్లర్ను నౌక ఢీకొట్టడంతో వంతెన కూలిపోతున్న దృశ్యాలు వైరల్గా మారిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సంఘటనపై స్పందించారు.
సహాయక సిబ్బంది, నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ‘ఓడ తమ నియంత్రణ కోల్పోయిందని గుర్తించిన సిబ్బంది వెంటనే స్పందించి మేరీలాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీని అప్రమత్తం చేశారు. దాంతో స్థానిక అధికారులు వంతెనపై రాకపోకలను ఆపివేయగలిగారు. వారి అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపా డింది’ అని బైడెన్ వెల్లడించారు. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ పునర్నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును ఫెడరల్ ప్రభుత్వం భరిస్తుందని జో బైడెన్ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో నౌకలోని భారతీయ సిబ్బంది క్షేమమని, ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయని షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ ప్రకటించింది. అందులో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. ఇద్దరు పైలట్లు సహా అందరిని గుర్తించినట్లు చెప్పింది.