ఈడీ కస్టడీలో మా సీఎం ఆరోగ్యం క్షీణిస్తోంది: ఆప్
మద్యం స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటోందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. డయాబెటిస్ తో ఇబ్బందిపడుతున్న కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని, ఈడీ కస్టడీలో ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని ఆప్ ఆరోపించింది. ఆయన షుగర్ లెవెల్స్ ఒక దశలో 46 ఎంజీ స్థాయికి పడిపోయాయని, ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆయన భార్య సునితా కేజ్రీవాల్ బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆమె తన భర్త హెల్త్ కండిషన్ పై ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తన భర్తను మంగళవారం కలుసుకున్నానని, ఆయన డయాబెటిక్ పేషంట్ కావడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.
"ఈడీ కస్టడీలో నా భర్త ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. అయినా ఆయన ధైర్యంగానే ఉన్నారు. ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని మాతోపాటు ప్రజలు కూడా ప్రార్థించండి" అని సునీతా కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. విచారణ అనంతరం కేజ్రీవాల్ ను 28వ తేదీ వరకూ రిమాండ్ విధించింది స్పెషల్ కోర్టు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న కేజ్రీవాల్.. తన కస్టడీపై కోర్టులో పోరాడుతున్నారు. కాగా.. గురువారంతో కేజ్రీవాల కస్టడీ ముగియనుండటంతో ఈడీ ఆయనను కోర్టు ముందు హాజరుపరచనుంది.