‘ఆర్ఎస్పీ గో బ్యాక్’: కలకలం రేపుతున్న పోస్టర్లు
‘బహుజన ద్రోహి.. ఆర్ఎస్పీ గో బ్యాక్’అంటూ రాసి ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ పోస్టర్లు కొమురంభీం జిల్లాలో కలకలం రేపాయి. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి కొమురం భీం జిల్లా, సిర్పూర్ నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలవడం చర్చనీయాంశంగా మారింది. 2021, ఆగస్టు 8న తన ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి మరీ రాజకీయ ప్రవేశం చేశారు. ‘‘దళితులు, బహుజనులు రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేసే సమయం ఆసన్నమైంది’’ అనే పిలుపుతో బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ)లో చేరారు. 2023 శాసనసభ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థిగా సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో 2024, మార్చి 16 బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిపోయారు.
ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడంతో అనేకమంది బహుజన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో ఉన్నంతవరకు బహుజన వాదిగానే ఉంటానని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు బహుజనుల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్కు తాకట్టురని, కేసీఆర్ పంచన చేరారని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ తరహాలోనే పోస్టర్లు తయారు చేసి సిర్పూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అంటించడం ఇప్పుడు నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. ఈ పోస్టర్ల వ్యవహారంలో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే రానున్న ఇటీవల మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందంటూ పార్టీ తెలంగాణ అధ్యక్షుడి హోదాలో ప్రకటించారు. అయితే పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అందుకు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఎస్పీకి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇక ప్రవీణ్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిర్పూర్ నియోజకవర్గ బీఎస్పీ నేతలంతా ఆ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్కుమార్.. బీఆర్ఎస్ అభ్యర్థిగా తొలిసారి సిర్పూర్ నియోజకవర్గానికి వస్తుండడం, అదే సమయంలో ఆయన ఫోటోతో ఉన్న పోస్టర్లు పలు చోట్ల వెలియడంతో స్థానికంగా రాజకీయం వేడెక్కింది.