షర్మిలను చూసి వైసీపీ భయపడుతోందా..?
ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా షర్మిల.. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతలకు ఈపరిణామం.. కాస్త మింగుడుపడడం లేదనే చెప్పాలి. ఎందుకంటే సాక్షాత్తూ వైసీపీ అధినేత, సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దీన్ని రూఢి చేస్తున్నాయి. పొత్తుల కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలోనే కాదు ఏపీ ప్రజలలోను ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. అసలు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం ఏమిటి? పొత్తుల కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నదెవరు? రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయని, కొత్త పొత్తులు పెట్టుకుంటారని, అబద్ధాలు చెబుతారని మోసాలు చేస్తారని సీఎం జగన్ ఎందుకు చెప్పారు అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది.కారణంగా మారింది.
మరోవైపు వైసీపీ మంత్రులు, పెద్దలు సైతం... కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి, ఏపీని నడిసంద్రంలో ముంచింది కాంగ్రెస్సేనని, ఆపార్టీ చేసిన మోసాన్ని ఆంధ్రప్రజలు మర్చిపోరంటున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ లో ఉన్నవారెవరైనా.. తమకు ప్రత్యర్థులే అని పరోక్షంగా షర్మిల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక మాజీమంత్రి కొడాలి నాని అయితే.. సీఎం జగన్ తో తలపడితే , షర్మిలకు రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు. వైసీపీ నేతలే కాదు.. గ్రామస్థాయిలోని కార్యకర్తల్లోనూ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పుడు ఎవరి ఓటు ఎటు వెళ్తుంది..? ఎవరికి అనుకూలంగా ఎవరు కదులుతారా అన్న ఆరాలు మొదలయ్యాయి.
అయితే షర్మిలను వైసీపీ ఏనాడు దగ్గర చేర్చుకున్న సందర్భం కనిపించలేదు. దీంతో ఆమె కొన్నాళ్లు వెయిట్ చేసిన తర్వాత... తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరుతో పార్టీ పెట్టుకున్నారు. అప్పుడే కుటుంబంలో అన్నా, చెల్లి మధ్య సంబంధాలపై చర్చ మొదలైంది. దీనికి తోడు ఆపార్టీ నేతలు...తమకు షర్మిల పార్టీతో ఎలాంటి బంధం లేదని ఆనాడే ప్రకటించేశారు. దీంతో ఆమె కూడా ఆఊరుకు ఈఊరు ఎంతదూరమో.. ఈఊరికి ఆఊరు సైతం అంతే దూరమన్నారు. అయితే షర్మిల పార్టీకి తెలంగాణలో ఆదరణ దక్కకపోవడంతో.. ఆమె నెమ్మదిగా కాంగ్రెస్ కు దగ్గరయ్యారు.
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిల అడుగుపెట్టడంతో.. వైసీపీకి విషమ పరిస్థితి ఎదురైందని చెప్పొచ్చు. ప్రస్తుతం వైసీపీలో మార్పులు, చేర్పులు.. భగ్గుమంటున్న అసంతృప్తి లాంటి అంశాన్ని నిశితంగా గమనిస్తున్న ఇతర పార్టీలు.. ఎన్నికల నాటికి పరిణామాలు ఇంకెలా మారతాయో అంచనాలు వేస్తున్నాయి. ఇంతలో షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో.. మరింతగా రాజకీయ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ .. ఏపీలో ఎలా అడుగులు వేయనుంది..? పార్టీలో షర్మిలకు ఎలాంటి పదవి కేటాయిస్తారు. ఏపీ ఎన్నికల రణతంత్రం ఎలా ఉండనుంది..? వీటన్నింటికీ కొద్దిరోజుల్లోనే సమాధానాలు దొరకనున్నాయి.