రాష్ట్ర విభజనకు చంద్రబాబుతో చేతులు కలిపిన కిరణ్ కుమార్ రెడ్డి..
రాజకీయాలలో ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాన్ని బట్టి శత్రువులు మిత్రులు అయితే ..కొన్ని సందర్భాలలో ఆప్త మిత్రులు కూడా బద్ధ శత్రువులుగా మారుతారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య దోస్తీ కూడా అలాంటిదే. ఒకప్పుడు మాటల యుద్ధాలు చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు ఒకరినొకరు మాటలతో పొగుడుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్న నోటితోనే నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని మురిసిపోతున్నారు. తాజాగా ఈ ఇద్దరి వైఖరిపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ్ సాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలు లేని రాజకీయాన్ని అవలంబించి రాష్ట్ర విభజనకు చంద్రబాబుకు సహకరించాడు కిరణ్ కుమార్ రెడ్డి అని విమర్శించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు అని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో కాంగ్రెస్ తో చేతులు కలిపి.. రాష్ట్ర విభజనకు చంద్రబాబుకు సహకరించిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని దుయ్యబట్టారు. అలాంటి ఘనత మూట కట్టుకున్న ఆ ఇద్దరు ఇప్పుడు బీజేపీ తో కలిసి కూటమిగా ప్రజలను మరొకసారి మోసం చేయడానికి ముందుకొస్తున్నారు అని ఆయన ఆరోపించారు.