మునుగోడులో టీఆర్ఎస్ విజయం...ఓడిన బిజెపి
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో అధికారపార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) విజయం సాధించింది. ఆఖరి రౌండ్ వరకూ టిఆర్ఎస్, బిజెపి మధ్య హోరాహోరీగా కొనసాగిన పోరులో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,309 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని సెమీ ఫైనల్గా భావించిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించి, సర్వశక్తుల్ని ధారపోశాయి. దేశ రాజకీయాల్లోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్న ఈ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకొని తమ సత్తా చాటాలని భాజపా తీవ్ర ప్రయత్నాలు చేయగా.. సీఎం కేసీఆర్ తన వ్యూహాలతో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశారు.
కాగా, ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. చివరికి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి (86,697) మీద టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (97,006) ఓట్లు సాధించి 10,309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాలుస్తూ, స్వీట్లు తినిపించుకుంటూ సంబురాల్లో మునిగి తేలారు.