కేంద్రం జోక్యంతోనే మణిపూర్ మెరుగుపడింది: ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే మణిపూర్లో పరిస్థితి చాలా మెరుగుపడిందని ప్రధాని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి శాయశక్తులనూ ఒడ్డి మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని మోహరించామని, దాని ఫలితమే నేడు మణిపూర్ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోందని పేర్కొన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిపూర్లోని పరిస్థితులపై మోదీ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్ఠి కృషి వల్లే మణిపూర్లో పరిస్థితి మెరుగుపడుతోందన్న మోదీ.. ప్రస్తుతం అక్కడ నెలకొన్న సున్నితమైన పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ఒక్కటిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మణిపూర్ హింస తారాస్థాయికి చేరుకున్న సమయంలో హోం మంత్రి అమిత్ షా మణిపూర్ చేరుకున్నారని, వివాదాన్ని పరిష్కరించేందుకు వివిధ వర్గాలతో 15కి పైగా సమావేశాలు నిర్వహించారని ప్రధాని మోదీ అన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని, కేంద్రం కూడా నిరంతరం రాష్ట్రానికి తన మద్దతు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం మణిపూర్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, శిబిరాల్లోని ప్రజల కోసం ఆర్థిక ప్యాకేజీలు అందిస్తున్నామని వివరించారు.
అనంతరం ఈశాన్య భారతంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందన్న ప్రధాని మోదీ.. అందుకోసం అనేక కీలక చర్యలు తీసుకుంటున్నామన్నా రు. ‘‘2014 నుంచి ఈశాన్య భారతంలో విద్య కోసమే రూ.14 వేల కోట్లు ఖర్చు చేశాం. తొలి స్పోర్ట్స్ యూనివర్శిటీని మణిపూర్లోనే ప్రారంభించాం. సిక్కింతో కలిపి ఈశాన్య భారత్లోని 8 రాష్ట్రాల్లో 200 ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేశాం. గత 10ఏళ్లలో అక్కడ 4,000 స్టార్టప్లు ప్రారంభమయ్యాయి. ఇదంతా ఈశాన్య భారత అభివృద్ధి కోసమే చేస్తున్నాం’’ అని మోదీ పేర్కొన్నారు.