న్యూజెర్సి ఇండియా డే వేడుకల్లో తమన్నా సందడి
న్యూజెర్సీలో ఓక్ ట్రీ రోడ్లోని ఎడిసన్ టు ఇసేలిన్ ఏరియాలో ఇండియా డే పరేడ్ వైభవంగా సాగింది. ఈ వేడుకలకు గ్రాండ్ మార్షల్గా ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హాజరయ్యారు. తమన్నా ఇటువంటి పరేడ్ కార్యక్రమంలో పాల్గొనడం తొలిసారి కావడం విశేషం. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగిన ఇండియా డే పరేడ్ వేడుకల్లో ఎంతోమంది భారతీయులు పాల్గొన్నారు.
ఎన్నారైలంతా న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్లో మువ్వన్నెల జెండాను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. పలువురు చిన్నారులు భారతమాత వేషాధరణలో.. స్వాత్రంత్య యోధుల గెటప్పులలో ఆకట్టుకున్నారు. ఒకరికొకరు స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పరేడ్లో భాగంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు శకటాలను ప్రదర్శించారు. భారీ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇక న్యూజెర్సీ ప్రాంతం మినీ ఇండియాగా మారిందా అనేలా అక్కడి వాతావరణం కనిపించింది. న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్లో జరిగిన ఇండియా డే పరేడ్ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులు హర్షం వ్యక్తం చేశారు.