న్యూయార్క్ లో శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ఆత్మశాంతి రాగసాగర సంగీత కచేరి.. పరవశించిన భక్తులు
అవధూత దత్త పీఠాధిపతి (మైసూర్, ఇండియా) పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 6:30 గం.లకు అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలోని కార్నిజి హాలులో ఆత్మశాంతి రాగసాగర అనే మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అండ్ హీలింగ్ కాన్సర్ట్ని నిర్వహించారు. ఈ కాన్సర్ట్కి వేలాది మంది హాజరై సంగీత పరమైన ఆనందంతో తన్మయత్వం చెందారు. 2023, నవంబర్ 27వ తేదీన మేరీలాండ్ క్లార్క్స్బర్గ్ లోని జయలక్ష్మీ దత్త యోగా సెంటర్లో న్యూస్ ఇండియా టైమ్స్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజ్య శ్రీస్వామీజీ మాట్లాడుతూ ఆత్మశాంతి రాగసాగర సంగీత కార్యక్రమములో ఆత్మకు ఉపశమనం కలిగించే విధంగా రాగాలు కూర్చి ఉన్నాయని చెబుతూ 2001 సంవత్సరం సెప్టెంబర్ 11న న్యూయార్క్లో జరిగిన విషాద సంఘటనకి గురి అయి, అకాల మృత్యువును పొందిన జీవుల ఆత్మకు శాంతి కలిగిస్తూ ఇంకా, కోవిద్ వ్యాధి బాధితులకు కూడా ఆత్మశాంతిని ప్రసాదిస్తూ, ఈ రాగసాగర కార్యక్రమము జరుగబోతున్నదని తెలియజేశారు. ఇంకా, ఈ కాన్సర్ట్కి ప్రత్యక్షంగా హాజరైన వారు కూడా అపారమైన వైద్య ప్రయోజనాలను పొందగలరనీ, సంగీతం ద్వారా ప్రసరించే ప్రత్యేకమైన ప్రకంపనలు వారి నరాలలో ప్రతిధ్వనించి, లోతైన చికిత్స అనుభవాన్ని అందిస్తాయని శ్రీ స్వామిజీ చెప్పారు.
న్యూయార్క్లోని కార్నిజి హాల్ ఎంతో ప్రత్యేకమై నది. ఈ హాల్ 1891 సంలో నిర్మించబడినది. మనకు విద్యుచ్ఛకి రాకముందే ఈ భవనమంతా ప్రత్యేకంగా, ధ్వని శాస్త్ర ప్రకారంగా కట్టబడినదని చెబుతారు. అందువలన సంగీత రాగాలకు ఎంతో అనుగుణమైన స్పందనలు కలిగి ఉన్న ఈ విశాలమైన భవనము ఈ కచేరీకి వేదికైంది. డిసెంబర్ 2వ తేదీ సాయంత్రము ఈ హాలు లో నిర్వహించిన నాదచికిత్సా కార్యక్రమములో పూజ్యశ్రీ స్వామీజీ వారు అక్కడ హాజరైన శ్రోతలందరినీ, తాము వాయించబోయే ప్రత్యేకమైన రాగాల ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందే విధంగా, అందరినీ రిలాక్స్డ్ గా కూర్చుని, మిగతా విషయాలు మరచిపోయే ఈ సంగీతాన్ని వినమనీ, నిద్ర వస్తే నిద్రపొమ్మని కూడా చెప్పారు.
ఆనాటి ప్రత్యేక రాగాలు
ఋష్యకేతుప్రియ రాగంలో ప్రణవ స్వరూపం
కాశ్యపి రాగంలో మాయారుపా
మెహన రాగంలో ఈ శపతీశ
పూర్ణపంచమం రాగంతో ఊగవమ్మా
హేమావతి రాగంతో శుంభో సాంగా
శంకరాభరణ రాగంతో డాన్సింగ్ ట్యూన్
సామ రాగంలో మంగళం పాటను సింథసైజర్ మిద శ్రీ స్వామిజీ వాయించారు.
సెర్వికల్ స్పాండిల్కెసిస్, సర్జికల్ థెరాయిడ్ వ్యాధి, హైపర్ ఎసిడిటీ, సయాటికా, నరాలకు సంబంధించిన నొప్పలు, హై బ్లడ్ ప్రెషర్, ఇన్సామ్నియా ఈ బాధలన్నిటికీ ఉపశమనం కలిగించే విధంగా శ్రీ స్వామిజీ ఆనాటి కార్యక్రమంలో ప్రత్యేకమైన రాగాలను ఎన్నుకొని, సింథసైజర్ మీద వాయించడం జరిగినది.
ఈ నాదచికిత్సా కార్యక్రమంలో శ్రీ స్వామీజీ వారికి వాయిద్యాల మీద సహకారం అందించన వారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వాయులీన విద్యాంసులు. పద్మశ్రీ భూషణ్ డా. శ్రీ.ఎల్. సుబ్రహ్మణ్యం ప్రత్యేక ఆకర్షణ కాగా, వయొలిన్మీద విద్యాన్ శ్రీ జైత్ర వారణాశి, కీ బోర్డు మీద విద్వాన్, శ్రీ మణి నరసింహన్, మృదంగం మీద విద్వాన్ శ్రీ శంకర రమేశ్, తబల మీద విద్వాన్ శ్రీ తన్మయ్ బోస్ గారు, వేణువు మీద విద్వాన్ శ్రీ చందన్ కుమార్ వీరందరు పూజ్యశ్రీ స్వామీజీ వారితో కలసి నిర్వహించిన ఈ మ్యూజిక్ కాన్సర్ట్ సుమారు 3 గంటల పాటు కొనసాగి ,హాలంతా క్రిక్కిరిసి ఉన్న శ్రోతలను, సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసినది.
ఈ విధమైన మ్యూజిక్ కాన్సర్ట్లను శ్రీస్వామిజీ దేశ విదేశాలలో 300 పైగా నిర్వహించి, గిన్నీస్ రికార్డును నెల కొల్పారు. ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనే గత 35 సంవత్సరములలో 75 కాన్సర్ట్లను నిర్వహించి ఉన్నారు. ఇది 76వ కాన్సర్ట్.
కలౌ సంకీర్తనాన్ముక్తి
ఈ కలియుగంలో అందరూ నామసంకీర్తన ద్వారానే, నాదం ద్వారానే ముక్తిని అందుకోగలరు. అందుకనే శ్రీ స్వామిజీ వారు. నాదం గురించి విస్తృతంగా ప్రచారం చేసి, దేశ విదేశాలలో సకల జనోపకరమైన నాద కచేరీలు చేస్తూ ఉన్నారు. రాగాలతో రోగాలను నివారణ చేశారు, చేస్తున్నారు. శ్రీ స్వామిజీ ఆచరించి చూపిన నాదచికిత్సా విధానం పద్ధతిపై ఇప్పటికీ వైద్యులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ, ఆ విధానమేమిటో వారికి అంతుపట్టటం లేదు!!!
శ్రీ నాదబ్రహ్మనేనమ:
- సుందరి చెన్నూరి