ఆయన అలా మాట్లాడటం సరైనది కాదు : మర్రి
తెలంగాణలో భారీ వర్షాలు పడడం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందని సీఎం కేసీఆర్ చెప్పడం బాధాకరమని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో కేసీఆర్ పక్కనే సీఎస్ సోమేష్కుమార్ ఉన్నారని ఆ సమయంలో సీఎంకు ఏం సమాచారం ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. క్లౌడ్ బరస్ట్ జరిగితే గంటకు వంద మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావాలన్నారు. ఉత్తరాఖండ్లోనూ క్లౌడ్ బరస్ట్ జరగలేదన్నారు. విపత్తుల సమయంలో అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా చేయడం లేదన్నారు.
కేసీఆర్ వద్ద ఏమైనా సమాచారం ఉంటే కేంద్రానికి ఇవ్వాలన్నారు. కేసీఆర్ను బద్నాం చేయడానికి కాళేశ్వరంలో వరద వచ్చేలా చేశారని అనుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన అలా మాట్లాడటం సరైనది కాదన్నారు. 80 వేల పుస్తకాలు చదవిన కేసీఆర్కు వర్షాలు ఎలా పడతాయో తెలీదా? అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో నగరాలు, పట్టణాల్లో భారీ వరదలు వస్తాయి. దానికి సిద్ధంగా ఉండాలి. విపత్తులు వస్తే ఎదుర్కొనేందుకు ఉన్న మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలన్నారు.