ఉజ్జయిని మహంకాళికి బంగారు బోనం
సికింద్రాబాద్లో లష్కర్ బోనాల పండుగ షురూ అయ్యింది. పోటెత్తుతున్న భక్తులు, ప్రముఖుల సందర్శనలతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం వైభవంగా జరిగాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు, మార్మోగాయి. ఆదయ్యనగర్ నుంచి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వరకు ర్యాలీగా వచ్చి అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పించారు. పోతరాజులు, డప్పుచప్పుళ్లు, డీజే సౌండ్, కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో ర్యాలీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రజలందరికీ మహంకాళి బోనాల శుభాకాంక్షలు తెలిపారు. 250 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అద్భుత ఆలయం మహంకాళి అమ్మవారిదన్నారు. అమ్మవారి ఆశీర్వాదాలతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. భారీ వర్షాల వల్ల పంట నష్టం, ప్రాణ నష్టం కలగకుండా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు.