ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మోడీ 'రామ'బాణం..

మోడీ 'రామ'బాణం..

2024 ఎన్నికల్లో అసాధారణ మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా కమలనాథుల వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తికానుండడంతో దాన్ని ప్రచారాస్త్రంగా మోడీ సంధించనున్నారు. ఈనెల 30 నుంచి దానికి సంబంధించిన ప్రణాళిక అమలు చేయనున్నారు. అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించి.. 15 కిలోమీటర్ల మేర రోడ్‌షోగా వెళ్లి.. పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్‌ని ప్రారంభించి, వందేభారత్‌, అమృత్‌భారత్‌ రైళ్లకు జెండా ఊపుతారు మోడీ..మళ్లీ విమానాశ్రయం వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు! ఆ తర్వాత.. జనవరి 22న అయోధ్యలో అట్టహాసంగా రామమందిర ప్రారంభోత్సవం జరుగుతుంది! ఆ కార్యక్రమం జరిగిన కొద్దిరోజులకే.. ఆ వేడుకల తాలూకూ సందడి ఇంకా దేశ ప్రజల హృదయాల నుంచి చెరిగిపోకముందే.. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలవుతుంది! రామమందిరమే ప్రధాన ప్రచారాస్త్రంగా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ.. దానికి అనుగుణంగా అత్యంత చాకచక్యంగా రూపొందించుకున్న ఎన్నికల ప్రణాళిక ఇది. ఈమేరకు.. రామమందిర ప్రారంభాన్ని ఒక చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తూ బీజేపీ ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

రామమందిర ఉద్యమంలో బీజేపీ పాత్ర, ఆలయ నిర్మాణం కోసం చేసిన కృషి గురించి వివరిస్తూనే.. ప్రతిపక్షాలు ఆ మందిర నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాయనే వివరాలన్నింటినీ ఆ బుక్‌లెట్‌లో రూపొందిస్తున్నారు. తద్వారా మరింతమంది కొత్త ఓటర్లను ఆకర్షించి.. పార్టీ ఓటింగ్‌ శాతాన్ని కనీసం పది శాతం మేర పెంచుకోవాలని... గతవారం జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ 50 శాతం ఓటింగ్‌ సాధించడంపై దృష్టి కేంద్రీకరించాలని నిశ్చయించారు. 2024లో అత్యధిక శాతం ఓట్లతో విజయం సాధించడమే మన లక్ష్యం అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ సమావేశంలో ప్రకటించారు. బీజేపీకి బలహీనమైన నియోజకవర్గాలంటూ ఉండబోవని.. అన్నింటినీ గెలిచే నియోజకవర్గాలుగానే భావించి, కష్టించి, విజయం సాధించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు దిమ్మెరపోయేలా 2024 విజయం అన్ని రికార్డులనూ బద్దలుగొట్టాలన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేంతవరకూ వేచిచూడాల్సిన అవసరం లేదని.. వెంటనే ప్రచార రంగంలోకి దూకాలని సమావేశంలో బీజేపీ అగ్రనేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి బీజేపీ సిద్ధాంతం, బీజేపీ నెరవేర్చిన చరిత్రాత్మక కర్తవ్యాలు, మోడీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి ప్రచారం చేయాలని.. అసాధారణ మెజారిటీతో మళ్లీ ప్రధానమంత్రిని చేయాలని అమిత్‌ షా సూచించారు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కాక.. పార్టీ ఏం చేసిందో చెప్పడమే ప్రచారంలో ప్రధానంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు..కొత్త ఓటర్లతో అనుసంధానం అయ్యేందుకు పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహించనుంది బీజేపీ. ఇందులో భాగంగా బూత్ స్థాయిలో బీజేపీ కార్యక్రమాలు నిర్వహించనుంది.

దేశవ్యాప్తంగా ఉన్న లోక్‌సభలను క్లస్టర్లుగా విభజించి సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. జనవరి 24న యువమోర్చా నూతన ఓటరు సదస్సులను ప్రారంభించనుంది. బీజేపీ యువమోర్చా దేశవ్యాప్తంగా 5,000 సదస్సులు నిర్వహించనుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా సామాజిక సదస్సులు కూడా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను పొందాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బీజేపీ మైనారిటీ ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :