హర్యానా కొత్త సీఎం.. నయాబ్ సింగ్ సైనీ
మనోహర్ ఖట్టర్ రాజకీయ వారసుడిగా నయాబ్ సింగ్ సైనీని ప్రకటించింది. నయాబ్ సింగ్ సైనీ ప్రస్తుతం హర్యానా బీజేపీ అధ్యక్షుడు, కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. మనోహర్ లాల్ ఖట్టర్కు సైనీ అత్యంత సన్నిహితుడు.
నయాబ్ సింగ్ సైనీకి 1996 నుంచి బీజేపీతో అనుబంధం ఉంది. 2002లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా, అంబాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2005లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సైనీ 2010లో నారాయణ్ గఢ్ నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ క్రమంలోనే 2015లో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019లో కురుక్షేత్ర స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ సింగ్పై 3.85 లక్షల ఓట్లతో విజయం సాధించారు.
సైనీ జనవరి 25, 1970న అంబాలాలోని చిన్న గ్రామమైన మిజాపూర్ మజ్రాలో కుటుంబంలో జన్మించారు. ఆయన ముజఫర్పూర్లో బి.ఆర్. అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం నుంచి Ch. బీఏ, ఎల్ఎల్బీ డిగ్రీలు పొందారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో పనిచేశారు. అటు తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ను కలుసుకుని, అతనితో కలిసి ప్రయాణం చేశారు. బీజేపీలో చేరి అంబాలా కంటోన్మెంట్లో అధ్యక్షుడితో సహా పార్టీలో అనేక పదవుల్లో పనిచేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఎన్నికల దిశగా తీసుకెళ్లడం.. సైనీకి ఓ పెద్ద టాస్కేనని చెప్పొచ్చు. కరెక్టుగా ఎన్నికల ముందు పార్టీలో సంక్షోభంతో ఖట్టర్ రాజీనామా చేయడంతో.. అనుకోని విధంగా సీఎం పీఠం సైనీని వరించింది. పార్టీని ఏకతాటిపై ఉంచడంతో పాటు స్వతంత్రులు, మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుతో పాటు ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉంది. అయితే మాజీ సీఎం ఖట్టర్ కు సన్నిహితుడు కావడంతో.. రాజకీయంగా ఇబ్బందులు తలెత్తవని భావించవచ్చు.