సామాన్యుల సొంతింటి కలలు నెరవేర్చండి : మంత్రి వేముల
హైదరాబాద్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా డెవలపర్లు అందుబాటు గృహాలను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. గచ్చిబౌలిలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 10వ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఐటీ, ఫార్మా రంగాలు బాగున్నాయి కాబట్టి పెద్ద సైజు గృహాలు, లగ్జరీ ప్రాపర్టీ విక్రయాలు బాగానే సాగుతున్నాయని, ఇది ఎల్లకాలం ఉండదని అన్నారు. గృహ విక్రయాలలో స్థిరత్వం
ఉండాలంటే మధ్యతరగతి గృహాలను నిర్మించాలన్నారు. ఆయా ప్రాజెక్ట్ల నిర్మాణాలకు అవసరమైన భూముల కొనుగోళ్లు, అనుమతుల మంజూరు, నిర్మాణ రాయితీలు వంటి వాటి కోసం మ్యుమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్తో చర్చిస్తానని, సానుకూల నిర్ణయం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వెలుపల 20-30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణం కోసం కేంద్రం ఆంగీకారం తెలిపిందన్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం సుమారు రూ.3 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా, ఇందులో రూ.1,500 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే రియల్టీ పరిశ్రమ 20-30 ఏళ్లు ముందుకెళుతుందని తెలిపారు. ఎక్కువ స్థలం అందుబాటులోకి వచ్చి చౌక ధరలలో స్థలాలు దొరుకుతాయని పేర్కొన్నారు.
త్వరలోనే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కు శాశ్వత చైర్మన్, పూర్తి స్థాయి అధికారులను నియమిస్తామని అన్నారు. రిటైర్డ్ జడ్జి లేదా పరిశ్రమలోని నిపుణులను అథారిటీగా నియమించే అంశం తుది దశకు చేరుకుందని తెలిపారు. ధరణిలో అర్బన్ ఏరియాలతో ముడిపడి ఉన్న వ్యవసాయ భూములలో కొన్ని మినహా, గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ భూములకు ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. ఆయా స్థలాల క్రయవిక్రయాల సమయంలో 15-20 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయని తెలిపారు. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు, లావాదేవీలకు ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా కూర్చున్న చోటు నుంచి పని చేసుకునే విధంగా సులభతరంగా ధరణిని రూపొందించామని చెప్పారు.