ఎలక్షన్ కమిషన్కు మమత వార్నింగ్
కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ ఎన్నికల సమయంలో ఎక్కడైనా అల్లర్లు జరిగితే తాను ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలీపుర్దువార్లో నిర్వహించిన ర్యాలీలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ ఆదేశాల మేరకు ముర్షిదాబాద్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను ఈసీ తొలగించింది. అలర్లు, హింసను ప్రేరేపించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ముర్షిదాబాద్, మాల్దాలో అలర్లు జరిగినట్లయితే అందుకు ఈసీదే బాధ్యత. అవసరమైతే ఈసీ కార్యాలయం ఎదుట 55 రోజుల పాటు నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నా’’ అంటూ బీజేపీ, ఈసీలపై దీదీ నిప్పులు చెరిగారు.
అంతేకాకుండా జైల్లో ఉన్న ప్రతిపక్ష నేతలను బీజేపీ బెదిరించడానికి ప్రయత్నిస్తోందంటూ ఆరోపించిన మమత.. బీజేపీకి ఎన్ని కారాగారాలు, ఎంతమంది పోలీసులు అనుకూలంగా ఉన్నారో చూస్తానన్నారు. తనపై ఎన్నోసార్లు దాడి జరిగిందని, అయినా తనలో ధైర్యం ఏ మాత్రం తగ్గలేదని, వాళ్లతో ఎలా పోరాడాలో తనకు బాగా తెలుసని మమత స్పష్టం చేశారు. అనంతరం టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి చెందిన హెలికాప్టర్లో ఐటీ సోదాలు నిర్వహించడంపై స్పందించిన బెంగాల్ సీఎం.. అధికారులకు ధైర్యం ఉంటే బీజేపీ నాయకులు తిరుగుతున్న హెలికాఫ్టర్లలో సోదాలు నిర్వహించాలంటూ ఐటీ శాఖకు సవాల్ విసిరారు.