మోదీ మాటల్లో ఆర్ఎస్ఎస్ వాసన: ఖర్గే
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కౌంటర్ ఇచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మోదీ సైద్ధాంతిక పూర్వీకులంతా బ్రిటిష్, ముస్లిం లీగ్లకు మద్దతు ఇచ్చారని అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాలు ఆర్ఎస్ఎస్ వాసన వస్తాయని, ఆయన దేశాన్ని విభజించి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆదివారం బీహార్లోని నవాడా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని, ఆ పార్టీ నేతల ప్రకటనల్లో జాతీయ సమగ్రతతో పాటు సనాతన ధర్మం పట్ల శత్రుత్వం కనిపిస్తోందని ఆరోపణలు చేశారు.
దీనిపై సోమవారం ఎక్స్ వేదికగా స్పందించిన ఖర్గే.. మోదీ-షాల రాజకీయ, సైద్ధాంతిక పూర్వీకులు స్వాతంత్ర్య ఉద్యమంలో భారతీయులకు వ్యతిరేకంగా బ్రిటిషర్లకు, ముస్లిం లీగ్కు మద్దతిచ్చారన్నారు. ‘1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపును, మౌలానా ఆజాద్ సారథ్యంలోని ఉద్యమాన్ని మోదీ-షా పూర్వీకులు వ్యతిరేకించారు. మీ పూర్వీకులు 1940లలో ముస్లిం లీగ్తో కలిసి బెంగాల్, సింధ్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఇది అందరికీ తెలుసు. అలాంటి వాళ్లు ఇప్పుడు భారతీయ పౌరుల సహకారంతో మేము రూపొందించిన న్యాయ పత్రాన్ని ముస్లిం లీగ్కు ఆపాదిస్తున్నారు’ అంటూ ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టారు.