'మధ్య భారతం'లో ఓట్ల పండుగ...!
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో నవంబర్ 17న ఒకేరోజు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఛత్తీస్గఢ్లో రెండో విడతలో భాగంగా 70స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీతోపాటు కమ్యూనిస్టు పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ బీజేపీ-కాంగ్రెస్ మధ్యే కీలక పోరు కొనసాగనుంది. ఛత్తీస్గఢ్లోనూ ఈ రెండు పార్టీల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది.
మధ్యప్రదేశ్లో నవంబర్ 17 ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను 5.6కోట్ల ఓటర్లు పాల్గొననున్నారు. ఇందులో 2.88 కోట్ల మంది పురుషులు కాగా 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 22.36లక్షల మంది యువతీ యువకులు తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ నుంచి 29 మంది సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, స్థానికంగా అభివృద్ధి వంటి అంశాలు రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్ నాథ్, విక్రమ్ మస్తాల్, గోవింద్ సింగ్లు పోటీలో ఉండగా.. బీజేపీ నుంచి కైలాస్ విజయ్వర్గీయ, శివరాజ్ సింగ్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రా, అంబరీష్ శర్మ వంటి నేతలు బరిలో దిగారు. ఛింద్వాఢ, ఇందౌర్-1, బుధ్నీ, నర్సింగ్పుర్, లహర్, దతియా నియోజకవర్గాల్లో పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు.
ఛత్తీస్గఢ్ పోలింగ్...
ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి సంబంధించి తొలిదశలో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ పూర్తయ్యింది. మరో 70 సీట్లకు నవంబర్ 17న ఓటింగ్ జరగనుంది. రెండో దశలో మొత్తంగా 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 827 మంది పురుషులు, 130 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. రెండో దశలో మొత్తం 1.63కోట్ల మంది ఓటర్లు ఈ అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఇందుకోసం 18,883 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. బీజేపీ మాత్రం అధికార పార్టీపై తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణలతో ఇరుకున పడేసే ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ముమ్మరంగా ప్రచారం చేశారు. బీజేపీ తరఫున అమిత్ షా, జేపీ నడ్డా, హిమంత బిశ్వశర్మ, అనురాగ్ ఠాకూర్తోపాటు ఇతర నేతలు ప్రచారం నిర్వహించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణనను నిర్వహిస్తామన్నారు రాహుల్. దీని వల్ల ఓబీసీలు, దళితులు, గిరిజన ప్రజలకు తమ వాస్తవ జనాభా ఎంతో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఇదిలాఉంటే, ఛత్తీస్గఢ్లో మొత్తం 90 స్థానాలకు గాను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 68 సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు పదిహేనేళ్లు పాలించిన బీజేపీ మాత్రం 15 స్థానాలకే పరిమితమయ్యింది. జేసీసీ ఐదు, బీఎస్పీ రెండుచోట్ల గెలుపొందాయి.