మూడు నెలల్లో ఆ పార్టీ దుకాణం బంద్ : మంత్రి కోమటిరెడ్డి
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని, వస్తే తాను దేనికైనా సిద్ధమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. తమను టచ్ చేస్తే బీఆర్ఎస్ను పునాదులతో సహా పెకిలిస్తామని హెచ్చరించారు. మూడు నెలల్లో ఆ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే వారికి మిగులుతారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు. 12-13 సీట్లు తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్తో కేసీఆర్, కేటీఆర్ పదేదో మాట్లాడుతున్నారు. వాళ్లిద్దరూ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం. చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టించి స్వాగతం పలుకుతాం అని అన్నారు.